“• ఉద్యోగాల కుంభకోణంపై బాధితులతో కలిసి డీజీపీని కలుస్తాం – కుంజా ధర్మా
భద్రాచలం, సెప్టెంబర్ 2: D వినేష్… TODAY9
దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు తెల్లం హరికృష్ణ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు తీసుకున్నారన్న ఆరోపణల వ్యవహారంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ కళ్యాణ్కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కుంజా ధర్మా సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఈ వ్యవహారం ద్వారా భద్రాచలం నియోజకవర్గానికి చెందిన మరికొందరు కాంగ్రెస్ నాయకుల ప్రమేయంపై కూడా తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయని, మొత్తం వ్యవహారం రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు ఉండొచ్చన్న సమాచారం ఉందన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించి మోసపోయిన బాధితులు ధైర్యంగా బయటకు రావాలని కుంజా ధర్మా పిలుపునిచ్చారు. బాధితులతో కలిసి తెలంగాణ డీజీపీని స్వయంగా కలిసి సమగ్ర విచారణకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అవసరమైతే కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకారంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
బాధితుల్లో ఆదివాసీలు ఉంటే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా న్యాయం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మీకు జరిగిన అన్యాయంపై ఆధారాలతో ముందుకు వస్తే బీజేపీ అండగా నిలుస్తుందని కుంజా ధర్మా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కుంజా సంతోష్, నిడదవోలు నాగబాబు, పీసీ కేశవ్, గుమ్మల్ల వెంకటేశ్వర్లు (జీవా), బోడ సత్యనారాయణ, జంపాల ప్రభాకర్, గంగులకుర్తి రామాచారి తదితరులు పాల్గొన్నారు.









