— విధుల్లో 51 డీఆర్ ఎఫ్ బృందాలు
— సిద్ధంగా 394 మంది గజ ఈతగాళ్లు..
నగరంలో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు HYDRAA విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ శాఖలతో కలిసి గణపతి విగ్రహాలు సులభంగా మండపాలకు చేరేందుకు వీలుగా అన్ని మార్గాల్లో చెట్టు కొమ్మలను తొలగించే పనులు నిర్వహిస్తోంది.
ఇదే క్రమంలో ఈ నెల 25, 26 తేదీల్లో నిమజ్జనోత్సవాలకు కూడా సన్నద్ధమౌతోంది. ఓ ఆర్ ఆర్ పరిధిలో జీహెచ్ ఎంసీ, సీఎంసీ పరిధిలో 47 చొప్పున మొత్తం 94 చెరువుల్లో గణేష్ నిమజ్జనోత్సవాలు జరగనుండగా.. ఎంఎంఎసీ పరిధిలో మొత్తం 9 చెరువుల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఇలా మూడు కార్పొరేసణ్ల పరిధిలోని 103 చెరువుల్లో నిమజ్జనోత్సవాలకు మూడు మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాట్లు చేయగా.. అక్కడ వివిధ శాఖలతో కలిసి పని చేసేందుకు 51 డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి.
ఇది ఇలా ఉండగా వీరికి తోడు 21 బైకు బృందాలు కూడా క్షేత్రస్థాయిలో ఉండి గణేష్ నిమజ్జనోత్సవానికి ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటాయి. ఈ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం సమీక్షించారు.
నిమజ్జనోత్సవాల్లో ఎక్కడా ఎలాంటి అవాంతరం ఏర్పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సెప్టెంబర్ 25, 26 తేదీల్లో నిమజ్జన కార్యక్రమం భారీగా జరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. శిక్షణ పొందిన స్విమ్మర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించాలన్నారు.
–భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా..
నిమజ్జనోత్సవానికి హైడ్రా తరఫున సన్నహాక కార్యక్రమాలను హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య వివరించారు. మొత్తం 394 మంది గజ ఈతగాళ్లను హైడ్రా తరఫు నుంచి సిద్ధం చేసినట్టు తెలిపారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా వీరు నీటిలో, పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించనున్నారు.
ప్రతి నిమజ్జన కేంద్రంలో పరిస్థితులకు అనుగుణంగా DRF బృందాలు, రక్షణ పరికరాలు, స్విమ్మర్లు అందుబాటులో ఉండేలా HYDRAA సమన్వయం చేస్తోంది. భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, నిమజ్జన వేడుకలను సురక్షితంగా నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తున్నారు.
హుస్సేన్ సాగర్లో ప్రతి షిఫ్టులో 50 మంది గజ ఈతగాళ్లు విధులు నిర్వహించనున్నట్టు చెప్పారు. పర్యాటక శాఖకు చెందిన బోట్లుతో పాటు.. హైడ్రాకు చెందిన 6 బోట్లను కూడా వినియోగిస్తామన్నారు.
దుర్గం చెరువు, ఐడీఎల్ చెరువు, మల్కం చెరువు, గంగారం చెరువు, లింగం చెరువు, దుండిగల్ పెద్దచెరువు ఇలా అవసరమైన చోట్ల గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లతో కలసి హైడ్రా సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు.









