గిరిజనులు సమర్పించిన విన్నపాలను నిరంతర పర్యవేక్షణతో యూనిట్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి..
భద్రాచలం ఐ టి డి ఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు విన్నపాలను, ఫిర్యాదులను ఐటీడీఏ పీవో బి రాహుల్, ఎస్ డి సి ఆనందకుమార్, గురుకులం ఆర్ సి ఓ అరుణకుమారి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ చందన, ఎడిఎంహెచ్వో సైదులతో కలిసి స్వీకరించారు. భూ వివాదాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతులు, సామాజిక భద్రతతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను గిరిజనులు పి ఓ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన ఐటీడీఏ పీవో, గిరిజనుల సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల యూనిట్ అధికారులకు వెంటనే పంపుతూ, నిర్దేశిత గడువులో పరిష్కారం చూపాలని ఆదేశించారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, మిగిలిన విన్నపాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ, గిరిజన దర్బార్ కార్యక్రమం గిరిజన ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసే ప్రత్యేకమైన వేదిక అని అన్నారు. గిరిజన ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును కేవలం నమోదు చేయడమే కాకుండా, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ఫలితాలు కనిపించేలా యూనిట్ అధికారులు పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతుందని తెలిపారు.
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని ఐటీడీఏ పీవో సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. గిరిజన ప్రజలు తమ వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు.
గిరిజన దర్బార్ లో స్వీకరించిన విన్నపాలు..
పోడు భూముల పట్టాలు ఆన్లైన్ చేయించుట కొరకు, వ్యవసాయానికి సంబంధించి కరెంటు, మోటారు, బోరు ఇప్పించుట కొరకు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి సబ్సిడీపై రుణాలు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో నడుస్తున్న మత్య సొసైటీల సమస్యలు పరిష్కరించుట కొరకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో స్వయం ఉపాధి ద్వారా జీవనాధారం పెంపొందించుకోవడానికి వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, సోలార్ ద్వారా తమ పొలాలలో విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కల్పించుట కొరకు, గురుకులాలు, ఈఎంఆర్ ఎస్ పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ మరియు ఆరవ తరగతిలో ప్రవేశం కల్పించుట కొరకు, వితంతు, ఒంటరి మహిళ, వృద్ధాప్య పెన్షన్లు ఇప్పించుట కొరకు, కళ్యాణ లక్ష్మి ప్రోత్సాహకాలు అందించుట కొరకు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇప్పించుట కొరకు గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏపీవో పవర్ వేణు, ఏవో సున్నం రాంబాబు,హౌసింగ్ ఏఈ హేమంత్ మరియు వివిధ విభాగాల సిబ్బంది విజయ్, స్వాతి, వెంకటేశ్వర్లు, జోగారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 11









