ఎప్పుడు తెగిపోతుందో తెలియని బ్రిడ్జి..
25 గ్రామాల ప్రజల్లో భయాందోళన!
జులై 29 : TODAY9
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చీకుపల్లి సమీపంలోని ఇసుకవాగు డైవర్షన్ రోడ్డు, బ్రిడ్జి ప్రమాదకరంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో డైవర్షన్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో 25 గ్రామాల ప్రజల రాకపోకలు ఎప్పుడు నిలిచిపోతాయో తెలియని దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వెళ్లాలో తెలియక ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వర్షం వస్తే చాలు.. ప్రాణాలు అరచేతిలో!
చీకుపల్లి:రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చీకుపల్లి సమీపంలోని ఇసుకవాగు డైవర్షన్ రోడ్డు, బ్రిడ్జి ప్రమాదకరంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులో నీటి ప్రవాహం భారీగా పెరగడంతో డైవర్షన్ రోడ్డు, బ్రిడ్జిపై వరద నీటి ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. దీంతో ఎప్పుడు తెగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
డైవర్షన్ కొట్టుకుపోతే 25 గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినా, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు ప్రయాణించాల్సి వచ్చినా ఏ దారి ద్వారా వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. డైవర్షన్ తెగిపోతే 25 గ్రామాల ప్రజలు పూర్తిగా రాకపోకలకు దూరమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్నా అధికారులు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూస్తారా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డైవర్షన్ రోడ్డు, బ్రిడ్జి వద్ద తక్షణమే రక్షణ చర్యలు చేపట్టి, 25 గ్రామాల ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.









