జిల్లా అధ్యక్షుడు బరగడ దేవదానం పిలుపు… ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో : భద్రాచలం, మే 5
టుడే 9 ప్రతినిధి
హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ జలవిహార్ సమీపంలోని గద్దర్ ప్రాంగణంలో నిర్వహించనున్న తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాలుగో ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. మంగళవారం భద్రాచలం పట్టణంలోని తొలి దశ ఉద్యమ నాయకులు తిప్పన సిద్ధులు స్వగృహంలో జరిగిన సమావేశంలో, తిప్పన సిద్ధులు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బరగడ దేవదానం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలతో సాధించుకున్నప్పటికీ, ఆ ఆశయాలు నెరవేరలేదని విమర్శించారు. మాజీ సీఎం కెసిఆర్ పాలనలో ప్రజల ఆశలు తీరలేదని, కాంట్రాక్టులు–కమిషన్ల రాజకీయాలు ప్రాధాన్యత పొందాయని ఆరోపించారు.
ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి నిరంకుశ ధోరణిలో నడిచిందని పేర్కొన్నారు. ఉద్యమ లక్ష్యాల సాధన కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ అత్యవసరమని, ఈ దిశగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినట్టు వివరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని, దేశంలో విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో కూడా అలాంటి రాజకీయాలను వ్యాప్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చిన “చదువు – బోధించు – సమీకరించు – పోరాడు” అనే సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో ప్రజలను సంఘటితం చేస్తామని తెలిపారు. తెలంగాణ నిర్మాణం కోసం పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్లీనరీ సమావేశానికి ప్రతి కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి, నాయకులు ప్రభాకర్ రెడ్డి, న్యాయవాది ఆంజనేయులు, రేపాక రామారావు తదితరులు పాల్గొన్నారు.









