నిందితులతో రాజీపడబోమనే అఫిడవిట్ తప్పనిసరి…

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో బాధితుల నష్టపరిహారానికి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిబంధన:…

.

​ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిరోధించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద నమోదయ్యే కేసుల్లో క్రిమినల్ విచారణ పారదర్శకతను కాపాడేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.

ఈ చట్టం కింద ప్రభుత్వ ఆర్థిక సహాయం లేదా నష్టపరిహారం పొందే బాధితులు, తాము విచారణ ముగిసేవరకు ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తామని, నిందితులతో ఎలాంటి రాజీకి తావులేకుండా కోర్టులో ప్రతికూలంగా (హోస్టైల్) మారబోమని లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలని జస్టిస్ విశాల్ మిశ్రా నేతృత్వంలోని జబల్‌పూర్ బెంచ్ స్పష్టం చేసింది. కేసు నమోదు చేసి, ప్రభుత్వ ఖజానా నుండి పరిహారం అందుకున్న తర్వాత, విచారణ దశలో బాధితులు నిందితులతో రాజీపడి మాట మార్చడం వల్ల చట్టం యొక్క అసలు ఉద్దేశమే దెబ్బతింటోందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.

జబల్‌పూర్ జిల్లా ఖమరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 376, 376(2)(n), 506తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన ఒక కేసులో 2022 డిసెంబర్‌లోనే ఛార్జ్‌షీట్ దాఖలైంది. అయితే ఎస్సీ, ఎస్టీ నిబంధనలు 1995లోని క్లాజ్ 44(i) ప్రకారం తనకు అందవలసిన ఐదు లక్షల రూపాయల పరిహారంలో 75 శాతం మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా కోరుతూ సదరు బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, బాధితులు ఆరంభంలో కేసులు పెట్టి ప్రభుత్వ నిధులను నష్టపరిహారంగా పొందుతున్నారని, ఆ తర్వాత విచారణ సమయంలో నిందితులతో రాజీపడి కోర్టులో మాట మారుస్తున్నారని (హోస్టైల్ టర్న్ అవ్వడం) ధర్మాసనం దృష్టికి తెచ్చారు.ఇలాంటి ధోరణి వల్ల ప్రజాధనం వృథా కావడమే కాకుండా చట్టబద్ధమైన న్యాయప్రక్రియ అపహాస్యమవుతోందని వాదించారు.

​ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, చట్టం ప్రకారం లభించే పరిహారం షరతులతో కూడిన హక్కు అని స్పష్టం చేసింది. బాధితురాలు నిందితులతో రాజీపడనని, కోర్టులో మాట మార్చనని స్పష్టం చేస్తూ తగిన అధికారులకు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.

ఒకవేళ బాధితులు ఈ నిబంధనకు కట్టుబడి ఉండటంలో విఫలమై, ప్రాసిక్యూషన్‌కు వ్యతిరేకంగా మారితే, విచారణ న్యాయస్థానం తీర్పు వెలువరించిన 30 రోజుల్లోగా ఆ పరిహార మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని, లేనిపక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం (M.P.L.R.C.) కింద వారి నుండి నిధుల వసూలు ప్రక్రియను చేపట్టవచ్చని కోర్టు పేర్కొంది.

ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని పొంది, ఆ తర్వాత అవాస్తవ లేదా స్వల్ప కారణాలతో కేసులను నీరుగార్చేలా వ్యవహరించే బాధితులపై విచారణ సంస్థలు నిఘా ఉంచాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టులను ఆదేశిస్తూ ఈ రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం ముగించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share